వేంకటేశ్వరస్వామి విష్ణురూపమా? శివరూపమా? శక్తిరూపమా?

తిరుమలేశుని విగ్రహం ఆగమాలకు అందని రూపం. వక్షస్థలంపై కౌస్తుభం, చేతికి నాగాభరణాలు, ఆలయగోపురంపై శక్తి వాహనమైన సింహం.. ఇలా విభిన్నదేవతా చిహ్నాలు కలిగిన దివ్యమనోహర విగ్రహం. ‘‘ఇరుండరువురం ఒండ్రాయ్‌ ఇసైందు’’ (ఇరుమూర్తులూ నీయందే ఉన్నాయి) అంటూ పెయ్‌ ఆళ్వార్‌ నోరారా కీర్తించాడు. ‘‘స్కంధ విష్ణ్వాత్మికా శక్తిః వేంకటేశ ఇతీరతః’’ అని స్కంధ పురాణం చెబుతోంది.అంటే శ్రీవారి మూర్తి స్కంధ, విష్ణు, శక్తి ఈ మూడు తత్వాలనూ కలిగి ఉన్నది.

 సప్తర్షులకూ ఏడురూపాల్లో సాక్షాత్కరించిన సత్యస్వరూపుడు వేంకటేశ్వరుడు. ఇలా చాలానే ఉదాహరణలు చెప్పవచ్చు. కానీ.. మనకున్న పద్దెనిమిది పురాణాలకుగాను 12 పురాణాల్లో శ్రీవారు విష్ణురూపమేనని చెబుతున్నాయి. కాబట్టి స్వామి నిస్సందేహంగా విష్ణురూపమే. అదీ సర్వదేవతా సమన్వయ స్వరూపం. అంటే ముక్కోటి దేవతలూ స్వామియందే ఉన్నారని అర్థం. ‘‘హరి అవతారములే అఖిలదేవతలు’’ అని అన్నమాచార్యులవారు చెప్పిందీ అదే కదా!